మోదీ పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు: పోలీస్ కమిషనర్

  • 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు
  • సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధం
  • మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సభను ప్రశాంతంగా నిర్వహించడానికి దాదాపు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధం విధించినట్లు చెప్పారు.

బహిరంగ సభ దృష్ట్యా రేపు మధ్యాహ్నం గం.1 నుంచి రాత్రి గం.9 వరకు పరేడ్ మైదాన పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. రోడ్ల మీద ఎక్కడైనా వాహనాలను పార్కింగ్ చేస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ప్రధాని సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా 12 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వాహనదారులు పార్కింగ్ ప్రదేశాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా అక్కడ క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రద్దీ దృష్ట్యా వాహనదారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు.

Narendra Modi
Hyderabad
Traffic restrictions
Parade Ground
Malkajgiri
Police Commissioner Sumati

More Telugu News